గొలుసు దొంగ ఉమేశ్ కథ అంతా
‘వి’చిత్రమే. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డా.. ఆమె మేజర్ కాగానే ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఆమె కోసం ఏదైనా చేస్తాడు. ఎంతైనా ఖర్చుపెడతాడు. గేర్ బండి నడుపరాదు.. కార్లను సునాయసంగా నడుపగలడు. కానీ దొంగతనానికి స్కూటీనే చోరీ చేస్తాడు. అదీ దానికి తాళంచెవి ఉంటేనే. అందుకోసం బండి దొరికే వరకు పదుల కిలోమీటర్లు అయినా నడుస్తూనే ఉంటాడు. బండి దొరగానే.. మాస్కు, క్యాప్, జాకెట్ ధరించి.. ఒకేరోజు వరుస స్నాచింగ్లకు పాల్పడుతాడు. పని పూర్తికాగానే.. అన్నీ అక్కడే బండితో పాటు వదిలేసి సొమ్ములతో పరారవుతాడు. కుటుంబ సభ్యులను కలుసుకొని జాలీగా గడిపేస్తాడు. బజ్జీ కొట్టు వ్యాపారి కొడుకు, చదివింది ఇంటర్మీడియెట్ అయినా.. పోలీసులకు చెమటలు పట్టిస్తాడు. విలాసవంతమైన జీవితం గడపాలని 2015లో స్నాచింగ్లకు తెరలేపాడని ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
ఇటీవల (జనవరి 19) హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఒకేరోజు ఆరు చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ఉమేశ్ ప్రస్తుతం గుజరాత్ అహ్మదాబాద్ గాంధీనగర్ పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. 24 గంటల్లో స్నాచర్ ఉమేశ్ ఆచూకీ కనుగొని గుజరాత్కు పయనమైన పోలీసులకు గాంధీనగర్ పోలీసులు షాక్ ఇచ్చారు. మన పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉమేష్ను అదుపులోకి తీసుకుని వారి వద్ద అతడిపై కేసులున్నాయని, వాటిపై విచారణ పూర్తయిన తర్వాతనే అప్పజెప్పుతామని తెలుపడంతో వెనుదిరిగారు.
గేర్ బండి నడపరాదు కానీ..
స్నాచర్ ఉమేశ్కు గేర్ బండి నడపరాదు. కానీ కారును తేలికగా నడుపుతాడు. అయితే స్నాచింగ్లు చేసేందుకు ముందుగా ఓ పట్టణానికి వెళ్తాడు. అక్కడ గేర్లేని బండి కోసం తిరుగుతాడు. అది కూడా అదే బైక్లకు తాళం ఉంటేనే కొట్టేస్తాడు. అలా దాని కోసం పదుల కిలో మీటర్ల వరకు నడుస్తూనే ఉంటాడు. బండీ దొరకగానే గల్లీగల్లీ తిరుగుతూ వరుస స్నాచింగ్లకు పాల్పడుతాడు. ఇలా 2015 నుంచి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నాడని పోలీసుల విచారణతో తేలింది.
విమానంలో హైదరాబాద్కు…
ఉమేశ్ జనవరి 18న విమానంలో హైదరాబాద్కు వచ్చాడు. శంషాబాద్లో దిగిన తర్వాత ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కు దగ్గర్లో ఉన్న లాడ్జికి తీసుకువెళ్లమని చెప్పాడు. అక్కడ దిగిన తర్వాత నాంపల్లి నుంచి దాదాపు అసిఫ్నగర్ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. చివరకు అక్కడ తాళం ఉన్న హోండా యాక్టివా కనబడటంతో దాన్ని చోరీ చేసుకుని నేరుగా రైల్వే స్టేషన్కు వచ్చి అక్కడ పార్కింగ్ చేశాడు. ఆ తర్వాత జనవరి 19న ఉదయమే అల్పాహారం తీసుకున్నాడు. చోరీచేసిన యాక్టివాపై గల్లీగల్లీ తిరుగుతూ అవకాశం ఉన్నచోటల్లా.. స్నాచింగ్కు పాల్పడ్డాడు. ఇలా ఒకే రోజు కుత్బుల్లాపూర్ నుంచి మేడిపల్లి వరకు వరుసగా ఆరు స్నాచింగ్లకు పాల్పడి దాదాపు 19 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు.
ఫోన్లో సిమ్ ఉండదు..మొబైల్ డాటా ఉంటుంది…
స్నాచింగ్కు బయలుదేరే సమయంలో ఫోన్లో సిమ్ ఉంచుకోడు. మొబైల్ డాటా ద్వారా ఫేస్బుక్, వాట్సాప్, ఇతర యాప్ల ద్వారా టైంపాస్ చేస్తాడు. భార్యకు ఫోన్ చేయాల్సి వస్తే ఎవరిదైనా అడుక్కుని ఫోన్ చేస్తాడు. ఇలా పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. అదే విధంగా సీసీ కెమెరాల్లో తన ముఖం కనబడకుండా ఉండేందుకు కచ్చితంగా క్యాప్, మాస్కు, జాకెట్ను వాడుతాడు. స్నాచింగ్లు పూర్తైన తర్వాత వెళ్లే సమయంలో వాటిని బైక్తో పాటే వదిలేస్తాడు.
బెంగళూరులో 8 స్నాచింగ్లు చేసి..
గుజరాత్లో పతంగులు ఎగిరేశాడు
గత నెల బెంగళూరు పట్టణంలో దాదాపు 8 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా గుజరాత్ వెళ్లిపోయి భార్య, కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగరేశాడు. బెంగళూరు పోలీసులు వెంటపడుతున్నారని తెలుసుకుని హైదరాబాద్కు వచ్చాడు.
అత్యాచారం చేశాడు.. ప్రేమించి పెండ్లాడాడు..!
ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఉమేశ్పై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే బాలిక మేజర్ అయిన తర్వాత ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. భార్య అంటే చాలా ఇష్టం. విమానాల్లో తిప్పుతాడు. ఆమె కోసం ఏదైనా చేస్తాడు. ఎంతైనా ఖర్చుపెడతాడు.