ఖమ్మం: జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నేలకొండపల్లి దవాఖానకు తరలించారు.
పత్తి తీసేందుకు మంగాపురం నుంచి గండ్రాయి వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 20 మంది కూలీలు ఉన్నారని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.