కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని గుప్తర్బాన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడులో ఓ విద్యార్థి మరణించాడని పోలీసులు తెలిపారు. జగద్దల్ పోలీస్స్టేషన్ పరిధిలోని భట్పారా మున్సిపాలిటీ పరిధిలోని గుప్తర్ బాగన్ ప్రాంతంలోని మోతీభాబన్ పాఠవాల సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. మృతుడిని అనురాగ్ సావుగా గుర్తించగా.. అతను బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
బాంబు పేలుడు శబ్దానికి అనురాగ్ గాయపడగా.. వెంటనే అతన్ని భట్పారా జనరల్ హాస్పిటల్కు తరలించారు. అయితే, విద్యార్థి అప్పటికే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బెంగాల్లో సోమవారం ఏడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు విడుత ఎన్నికలు పూర్తి కాగా.. ఈ నెల 29న చివరి విడుత పోలింగ్ జరుగనుండగా.. మే 2న ఫలితాలను ఈసీ ప్రకటించనుంది.