తిరుపతి, మే 26: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించారు. వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు బంగారు రథం బదులు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు ఆలయంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.