అమరావతి : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు ఇవాళ ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి దుర్గమ్మను దర్శిం చుకోవడానికి భక్తులు బారులు తీరారు. వృద్ధులు, దివ్వాంగులకు దర్శనానికి ప్రత్యేక సమయాన్ని ఆలయ కమిటీ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు దర్శనాన్ని కేటాయించారు. అక్టోబర్ 2న మినహా ఇతర రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు : మంత్రి
కాగా ఏపీ దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారిని ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తున్నామని చెప్పారు. నిన్న అమ్మవారిని 30వేల మంది భక్తులు దర్శించుకున్నారని వివరించారు. తొలిరోజు తలెత్తిన చిన్న చిన్న సమస్యలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆన్లైన్ టికెట్ల విక్రయాల్లో నిన్న సాంకేతిక సమస్యలొచ్చాయని , ఆన్లైన్ టికెట్లను స్కాన్ చేశాకే దర్శనానికి అనుమతి లభిస్తుందని అన్నారు. లడ్డు ప్రసాదాల కొరత లేదని చెప్పారు.