హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తేతెలంగాణ) : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు బుధవారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 వరకు స్వామివారికి పల్లకి ఉత్సవం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీభూవరాహస్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిరంజన్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు.