డెహ్రాడూన్: బీజేపీ నేతల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ ఒక బీజేపీ నేత డిమాండ్ చేశారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు. ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ ఈ నెల 10న హల్ద్వానీలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హర్ ఘర్ తిరంగ’ డ్రైవ్లో భాగంగా జాతీయ జెండాను ఇళ్లపై పెట్టుకోని వారిని నమ్మవద్దని పిలుపునిచ్చారు. అలాంటి ఇళ్లను ఫొటో తీసి తనకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలతో అన్నారు. జాతీయ జెండాను ఇంటిపై ఉంచితేనే దేశ భక్తి ఉన్నట్లుగా, లేకపోతే దేశంపై నమ్మకం లేనివారిగా ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ మాట మార్చారు. గురువారం డెహ్రాడూన్లో జరిగిన జాతీయ జెండా ర్యాలీలో పాల్గొన్న ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఎవరినీ అనుమానించడం తన ఉద్దేశం కాదని అన్నారు. ఫొటోలు తీయమన్నది బీజేపీ కార్యకర్తల ఇళ్లనే అంటూ మాట మార్చారు. జాతీయ జెండాను ఇంటిపై ఉంచడంలో ఎవరికైనా ఏమైనా సమస్యా? , అభ్యంతరం ఎందుకు? అంటూ ఎదురు ప్రశ్నించారు.