ముంబై: రోజురోజుకు రూపాయి మారకం విలువ పతనం కావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆరోపించింది. ఈ మధ్య కాలంలో రూపాయి విలువ వరుసగా పతనమవుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది.
గత కొన్ని రోజులుగా అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతున్నది. మంగళవారం నాటి ఎర్లీ ట్రేడింగ్లో కూడా రూపాయి విలువ 43 పైసలు పతనమై రూ.81.52 వద్ద కొనసాగుతున్నది. బీజేపీ క్యాడర్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా మూడు రోజులపాటు బారామతిలో పర్యటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. పర్యటన చివరి రోజైన శనివారం పుణెలో మీడియాతో మాట్లాడారు.
రూపాయి పతనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నాయని, మిగతా దేశాల కరెన్సీలతో పోల్చితే అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ త్వరలోనే మెరుగుపడుతుందని ఆ మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె చెప్పిన మరుసటి ట్రేడింగ్లోనే రూపాయి భారీగా పతనం కావడంతో ఎన్సీపీ నిలదీసింది. నిర్మలా సీతారామన్ బారామతి కంటే ఎక్కువగా దేశ ఆర్థిక పరిస్థితిపై దృష్టిపెడితే మంచిదని సూచించింది.