జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. 77 దేశాల్లో ఆ వేరియంట్కు చెందిన కేసులు నమోదు అయినట్లు చెప్పింది. మీడియాతో మాట్లాడిన డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ ఈ విషయాన్ని తెలిపారు. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్ను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ను అదుపు చేసేందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ను అంచనా వేయడంలో విఫలం అయ్యామని, ఒమిక్రాన్ వల్ల స్వల్ప తీవ్రత ఉన్న వ్యాధి సోకినా, దాంతో ఆరోగ్య వ్యవస్థపై మళ్లీ ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ను తొలిసారి నవంబర్లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేలారు. స్వల్ప లక్షణాలతో ఆయన ఇంకా ఐసోలేషన్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అసమానతలు ఉన్నట్లు టెడ్రోస్ తెలిపారు. ఒమిక్రాన్ వేళ కొన్ని దేశాలు బూస్టర్ డోసులు ఇస్తున్నాయని, కానీ ఇంకా కొన్ని దేశాలకు అసలు వ్యాక్సిన్లు అందలేదన్నారు. కోవిడ్ వ్యాప్తిని బూస్టర్ డోసులతో అడ్డుకోవచ్చు అని, కానీ ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలన్నారు.