ఒమిక్రాన్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టిమ్స్ వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం మూడు కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఒమిక్రాన్ పెద్ద ప్రమాదకారి ఏం కాదని.. వైరస్ వచ్చిన వారిలో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం టిమ్స్లో చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి లక్షణాలు లేవని వివరించారు.
ప్రత్యేక వార్డులు..
టిమ్స్లో ప్రస్తుతం కొవిడ్, నాన్ కొవిడ్ రోగులతో పాటు ప్రత్యేకంగా ఒమిక్రాన్ రోగులకు సైతం చికిత్స అందిస్తున్నారు. మూడో అంతస్తులో ఒమిక్రాన్ రోగులు, 2వ
అంతస్తులో కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. రోగులు ఒకరికి ఒకరు కలవకుడా అన్ని రకాల జాగ్రతలు తీసుకుంటున్నారు. ఇక సాధారణ రోగులకు నాన్కొవిడ్
సేవలు సైతం అందిస్తున్నారు.
ఆ ఇద్దరికి టిమ్స్లో చికిత్స
మరో ఏడేండ్ల బాలుడిని వెస్ట్ బెంగాల్కు తరలింపు…బాధితులు తిరిగిన ప్రాంతాలపై వైద్యాధికారుల నజర్.. తండ్రి వైద్యం కోసం సోమాలియా నుంచి వచ్చిన ఒకరు, ఇతర పనుల మీద కెన్యాకు చెందిన యువత శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాగా వీరికి వైద్య పరీక్షలు చేయగా ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. మరో ఏడేండ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినా నగరంలోకి ప్రవేశించకుండానే విమానాశ్రయం నుంచే డొమెస్టిక్ ఫ్లైట్లో పశ్చిమ బెంగాల్కు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా గ్రేటర్లో అలజడి మొదలైంది. ఈ సమాచారం అందుకున్న వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పాజిటివ్ వచ్చిన మహిళను టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో గుర్తించి చికిత్స నిమిత్తం టిమ్స్కు తరలించారు. ఆమెతో పాటు నలుగురు కుటుంబ సభ్యుల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తిని సైతం చికిత్స నిమిత్తం టిమ్స్కు తరలించి వైద్యం చేస్తున్నారు. మరోవైపు బాలుడి వివరాలను సైతం వెస్ట్ బెంగాల్ వైద్యాధికారులకు సైతం అందించి అప్రమత్తం చేశారు.
100 మంది నమూనాల సేకరణ..
విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది రోగుల కాంటాక్ట్స్పై ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. రోగుల కుటుంబ సభ్యులతో పాటు వారు సన్నిహితంగా మెలిగిన వంద మందిని గుర్తించి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి వెల్లడించారు. బాధితులు ఉన్న నివాసాలతో పాటు ఆ కాలనీ మొత్తాన్ని శుభ్రపరిచినట్లు వివరించారు. అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి, కరోనా నియమాలు పాటించాల్సిందిగా అవగాహన కల్పిస్తున్నామన్నారు.