సూర్యాపేట : ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి గొంతు కోసి ఒంటిమీద ఉన్న ఆభరణాలను దుండగులు ఎత్తికెళ్లిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2లో నివాసముంటున్న ఆలేటి జానకమ్మ(70) మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం, రెండున్నర తులాల పుస్తెలతాడు, 10తులాల వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు.
ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు ఆలేటి శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో నివాసముంటూ వారంలో రెండు రోజులు తల్లి దగ్గరకి వచ్చి పోతుంటాడు. స్థానికుల ద్వారా హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుమారుడు బుధవారం తెల్లవారుజామున సూర్యాపేటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపడుతున్నారు.