ముంబై : మహారాష్ట్రలోని చిక్లి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రూ 1.3 కోట్ల విలువైన 216 పురాతన బంగారు నాణేలు లభ్యమయ్యాయి. 2357 గ్రాముల బరువున్న ఈ బంగారు నాణేలు 1720-1750 నాటి కాలానికి చెందినవని గుర్తించారు. పురావస్తు శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బంగారు నాణేలపై రాజ మహ్మద్ షా అనే పేరును ఉర్దూ, అరబిక్లో ముద్రించారని పోలీస్ కమిషనర్ కృష్ణ ప్రకాష్ వెల్లడించారు. ఒక్కో నాణెం విలువ రూ 60,000 నుంచి రూ 70000 వరకూ ఉంటుందని అంచనా వేశారు.
పింప్రి ప్రాంతంలోని నెహ్రూనగర్ వాసి సద్దాం సలార్ కాన్ వద్ద పురాతన బంగారు నాణేలున్నాయనే సమాచారంతో పోలీసులు ఆయన ఇంటిలో సోదాలు చేయగా ఇవి లభ్యమయ్యాయి. సద్దాం మామ ముబారక్ షేక్, బావమరిది ఇర్ఫాన్ షేక్లను వెంటపెట్టుకుని చిక్లిలో నిర్మాణ పనులకు వెళ్లాడు. అక్కడ తవ్వకాలు చేపడుతుండగా ఇవి బయటపడ్డాయి. దీంతో సద్దాం ఈ నాణేలను తన ఇంటికి తీసుకువచ్చాడు. పంపకాల్లో విభేదాలు పొడచూపడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అత్యంత విలువైన పురాతన బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు. అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.