Bhavish Agarwal | ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవిష్ అగర్వాల్.. మరోమారు ప్రధాన స్రవంతి మీడియాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముంబైలో టాటా నెక్సాన్ ఈవీ కారులో మంటలు చెలరేగినట్లు వచ్చిన వార్తలపై స్పందించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్లో అగ్ని ప్రమాదాలు సాగుతాయంటూ గురువారం ట్వీట్ చేశారు.
`ఎలక్ట్రిక్ వెహికల్స్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. గ్లోబల్ ఉత్పత్తుల్లోనూ జరుగుతుంటాయి. ఐసీఈ (ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ – internal combustion engine )ల కంటే ఈవీల్లో అగ్ని ప్రమాదాలు తక్కువే` అని ట్వీట్ చేశారు. దీన్ని ఆటో కార్ ఇండియా వెబ్సైట్ ఎడిటర్ హోర్మాండ్ సొరాబ్జీని ట్యాగ్ చేశారు. ఒక సీనియర్ ఆటోమొబైల్ రంగ జర్నలిస్టును `పెట్రోల్ మీడియా` అని భవిష్ అగర్వాల్ అభివర్ణించారు. గతంలో ఓలా ఎలక్ట్రిక్కు చెందిన స్కూటర్లలో అగ్ని ప్రమాదాలపై ట్విట్టర్ వేదికగా విమర్శలు ఎదుర్కొన్న అగర్వాల్.. తన విమర్శలకు సమాధానంగా బర్నాల్ ఫొటోలు షేర్ చేశారు.
గత రెండు, మూడు నెలలుగా పలు ఈవీ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థలు బ్యాటరీ డిజైన్లో లోపాలు, ఫాల్ట్లపై విమర్శలు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా బ్యాటరీల డిజైన్ను నిశితమైన స్క్రూటినీ చేపట్టాయి.
గత మార్చిలో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్లో పుణెలో రోడ్డు పక్కన మంటలొచ్చాయి. దీన్ని ఐసోలేటెడ్ ఘటన అని ప్రాథమికంగా నిర్ధారించారు. తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్వచ్ఛందంగా ఆ బ్యాచ్కు చెందిన 1441 స్కూటర్లను ముందస్తుగా రీ కాల్ చేసి, వాటి పనితీరులో లోపాలను చెక్ చేసింది. ఏప్రిల్లో తమిళనాడులో ఒక వ్యక్తి.. మైలేజీ, పెర్పార్మెన్స్ తక్కువగా ఉండటంతో ఓలా ఈ-స్కూటర్కు నిప్పంటించాడు. మహారాష్ట్రలో ఒక వ్యక్తి.. గాడిదకు ఓలా స్కూటర్ను కట్టి నిరసన తెలిపాడు.