Ola & Uber | దేశంలోని క్యాబ్ సర్వీస్ సంస్థలు ఉబెర్ టెక్నాలజీస్, ఓలా తాము విలీనం అవుతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చాయి. ఇటీవల అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోలో విలీన చర్చల కోసమే ఉబెర్ టాప్ ఎగ్జిక్యూటివ్లతో ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ సమావేశమయ్యారని పేర్కొంటూ ఓ ఆంగ్ల దిన పత్రిక ఒక వార్తాకథనం ప్రచురించింది. కానీ.. ఓలాతో విలీనంపై తాము చర్చలు జరుపలేదు. అది అసత్యం అని ఉబెర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉబెర్తో విలీనం చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ రియాక్ట్ అయ్యారు. `అదంతా చెత్త`. మేం చాలా లాభాల్లో ఉన్నాం. ఎదుగుతున్నాం. ఒకవేళ ఇతర కంపెనీలు భారత్లో లావాదేవీల నుంచి వైదొలిగితే, మేం వారిని స్వాగతిస్తాం. కానీ మేం విలీనం కాబోము అని ట్వీట్ చేశారు.
భారత్లో క్యాబ్ సర్వీసుల మార్కెట్పై పట్టు కోసం ఉబెర్, ఓలా పరస్పరం పోటీ పడుతున్నాయి. డ్రైవర్లకు భారీగా ఇన్సెంటివ్లు, ప్యాసింజర్లకు డిస్కౌంట్లు ఇచ్చాయి. కానీ, కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇదిలా ఉంటే ఉబెర్.. భారత్లో తన ఫుడ్ డెలివరీ బిజినెస్ ఉబెర్ ఈట్స్ను 2020 జనవరిలో జొమాటోకు విక్రయించింది. గ్రాసరీ డెలివరీ బిజినెస్లో నిధులు పెట్టిన ఓలా దాన్ని మూసేసి, తదుపరి ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్.. ఓలా ఎలక్ట్రిక్లో పెట్టుబడులు పెట్టింది.