న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న ఘటనలు పెరుగుతుండటంతో ఓలా కంపెనీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 1,441 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి రప్పిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. గత నెల 26న పుణెలో ఓలా స్కూటర్ ఉన్నట్టుండి మంటలంటుకొని కాలిపోయింది.
దీంతో ఆ బ్యాచ్లో తయారైన వాహనాలను పరీక్షల కోసం వెనక్కి తీసుకొంటున్నట్టు వెల్లడించింది. పుణె ఘటనపై తమ ఇంజినీర్లు విచారణ జరుపుతున్నారని పేర్కొంది. కాగా, ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఏపీలో శనివారం ఒకరు మరణించడం తెలిసిందే.