న్యూఢిల్లీ: మళ్లీ ముడి చమురు భగభగలు మొదలయ్యాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చేనెలలో బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 75 డాలర్లకు చేరుకోవచ్చని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ వుడ్ మెకెంజీ అంచనా వేసింది. అలాగే అంతర్జాతీయంగా రోజువారీగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ 63 లక్షల బ్యారెళ్ల మేరకు పెరుగుతుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలులు మళ్లీ పుంజుకుంటున్నందున వచ్చే రెండేళ్లలో బ్యారెల్ ముడి చమురు మూడెంకల(100 డాలర్ల) స్థాయికి చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా భావిస్తోంది.
వచ్చే ఏడాది చివరి నాటికి, అంటే 2022 డిసెంబర్ నాటికి బ్యారెల్ క్రూడాయిల్ 100 డాలర్లకు చేరుకోవచ్చని అజెర్బైజాన్లోని సోకార్ ట్రేడింగ్ ఎస్ఏ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికే క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్లకు చేరుతుందని గోల్డ్ మ్యాన్ సాచెస్ గత నెలలోనే అంచనా వేసింది.
అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధర రెండు శాతం మేర పెరిగి 70.82 డాలర్లకు చేరింది. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు ముడి చమురు గరిష్ఠ ధర ఇదే. అలాగే, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత క్రూడ్ 70 డాలర్లను చేరడం ఇదే ప్రథమం.అమెరికాలో టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడాయిల్ రేటు ఒక దశలో 1.15 శాతం ఎగబాకి 66.83 డాలర్లకు చేరుకుంది.
ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని ముడి చమురు పరిశ్రమ కేంద్రాలపై యెమెన్ హౌతీ దళాలు డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడటంతోనే ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఎందుకంటే, సౌదీ అరేబియా ప్రపంచంలోని అతిపెద్ద క్రూడ్ ఎగమతి దేశాల్లో ఒకటి. కరోనా సంక్షోభ ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న సంకేతాలు కూడా ముడి చమురు ధరల పెరుగుదలకు కారణం అన్న అభిప్రాయం ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ముడి చమురు ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి.
భారత దేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో బ్యారెల్ ముడి చమురు ఫ్యూచర్స్ కాంట్రాక్టు(మార్చి డెలివరీ) ధర ఒకదశలో రూ.47 పెరిగి రూ.4,891కి ఎగబాకింది. భారత మార్కెట్లో ఆల్టైం రికార్డు స్థాయిలకు ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఇప్పటికే మంట పుట్టిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ సెంచరీ మార్కును దాటేసింది. మిగతా ప్రాంతాల్లో సెంచరీకి అతి చేరువలో ఉంది.
గతనెలలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. గడిచిన 8 రోజులుగా యథాతథంగా కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు 70 డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో మంగళవారం మన మార్కెట్లో పెట్రోల్, డీజిల్ మరింత ఎగబాకే అవకాశం ఉంది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు కేంద్ర చమురు సంస్థలు లీటర్ పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.11 మేర పెంచాయి.