సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మెడికల్ కౌన్సిల్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమాలు పాటించని ప్రైవేటు దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఒకపక్క వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తున్నది. గత నాలుగు రోజులుగా నిబంధనలు పాటించని పలు దవాఖానలను సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యశాఖ బాటలోనే ఫార్మసీ కౌన్సిల్ కూడా పలు చర్యలకు ఉపక్రమించింది.
ఆరోగ్య తెలంగాణలో భాగంగా నాణ్యమైన చికిత్సతో పాటు నాణ్యమైన మందులు ఇచ్చినప్పుడు రోగికి పూర్తిస్థాయి ఆరో గ్యం లభిస్తుందనే భావనతో మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫార్మసీ చట్టాలకు లోబడి లేకుండా ఇష్టానుసారంగా నిర్వహించే మెడికల్ షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.