సత్తుపల్లి, సెప్టెంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం మూడురోజులపాటు ప్రకటించిన సమైక్యతా వజ్రోత్సవ వేడుకలకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడురోజుల పాటు జరిగే సమైక్యతా వజ్రోత్సవ వేడుకలకు అన్నిశాఖల అధికారులు సిద్ధం కావాలని సూచించారు. ఈ నెల 16న నియోజకవర్గ కేంద్రమైన సత్తుపల్లిలో ర్యాలీలో పెద్దఎత్తున ఉద్యోగులు పాల్గొనేలా అధికారులు చొరవ చూపాలన్నారు.
17న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలు చేయాలని, 18న కవులు, కళాకారులు, మేధావులు, స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించాలని సూచించారు. తెలంగాణ ఖ్యాతిని చాటేలా ఉత్సవాలు నిర్వహించేందుకు అందరి సహకారం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఏసీపీ వెంకటేశ్, కమిషనర్ సుజాత, తహసీల్దార్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సీఐ కరుణాకర్, బాలాజీరెడ్డి, చాంద్పాషా, వల్లభనేని పవన్, అద్దంకి అనిల్ పాల్గొన్నారు.