హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మున్సిపాలిటీల్లో చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని పలు రాష్ర్టాల అధికారుల బృందం ప్రశంసించింది. మరుగుదొడ్ల నిర్వహణ, ఎఫ్ఎస్టీపీలు, హరితహారం తదితర కార్యక్రమాలను బ్రహ్మాండంగా అమలుచేస్తున్నారని అభినందించింది. శనివారం అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ రాష్ర్టాలకు చెందిన మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల అధికారులు యూనిసెఫ్ కన్సల్టెంట్స్ 30 మందితో కూడిన బృందం హైదరాబాద్ పర్యటించింది. ఈ సందర్భంగా కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ఎన్ సత్యనారాయణతో బృందం సభ్యులు భేటీ అయ్యారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెద్దఎత్తున చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం, వాటి నిర్వహణలో అవలంబిస్తున్న ఆధునిక విధానాలు, ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ), ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ హరితహారం, పట్టణప్రగతి లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీడీఎంఏ వివరించారు. ప్రతి మున్సిపాలిటీలో 1000 మందికి ఒక మరుగుదొడ్డిని నిర్మించామని తెలిపారు. టీఎస్బీపాస్ ద్వారా ఆన్లైన్లో ఇండ్లకు అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పట్టణంలో కనీసం ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్శాఖ జాయింట్ డైరెక్టర్ ఫాల్గున్ కుమార్, ఆస్కి డైరెక్టర్ ప్రొఫెసర్ మాళినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.