కుంభవృష్టిగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు, కుంటలు మత్తడి పోశాయి. ఏకధాటి వానలకు జిల్లాలోని అనేక గ్రామాల్లో రోడ్లు దెబ్బతినగా, ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం జూలై నెలలో పడిన వర్షానికి 172 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరద పోటెత్తి కొన్ని గ్రామాల్లో రోడ్లు తెగిపోగా, మరికొన్ని చోట్ల బీటీ కొట్టుకుపోయి కంకర తేలాయి. ఇక పంటనష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 435 ఎకరాల్లో వరి, 80ఎకరాల్లో పత్తి, 58 ఎకరాల్లో కూరగాయలు, 10 ఎకరాల్లో బొప్పాయి పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. నేటి నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నారు.
మహబూబాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): వరుసగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. ప్రజలు ఇండ్లకే పరిమితం కాగా, వరద పోటెత్తి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు మత్తడి పోశాయి. గురువారం వరుణుడు కాస్త గెరువివ్వడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. గతంలో కురిసిన వర్షంతోపాటు ఇటీవల కురిసిన వర్షానికి జిల్లాలో 172 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బయ్యారం మండంలో 11, డోర్నకల్లో 4, గంగారంలో ఒకటి, గార్లలో 3, గూడూరులో 3, కేసముద్రంలో 4, కొత్తగూడలో 13, కురవిలో 11, మహబూబాబాద్లో 5, చిన్నగూడూరులో 10, దంతాలపల్లిలో12, మరిపెడలో 30, నర్సింహులపేట ఒకటి, నెల్లికుదురులో 36, పెద్దవంగరలో 15, తొర్రూరు మండలంలో 13 మొత్తం 172 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మండలాల వారీగా ఇండ్లు దెబ్బతిన్న ప్రజల వివరాలను అధికారులు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.
అదేవిధంగా అతిభారీ వర్షాలకు పెద్దవంగర, దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో కొన్ని రోడ్లు తెగిపోగా, మరికొన్ని దెబ్బతిన్నాయి. దీంతోపాటు పంటనష్టాన్ని కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 435 ఎకరాల్లో వరి, 80 ఎకరాల్లో పత్తి పంట, తొర్రూరు, దంతాలపల్లి మండలాల్లో టమాట, కాకర, బీర, మిర్చి తదితర కూరగాయల తోటలు 58 ఎకరాల్లో, నర్సింహులపేట మండలం జయ్యారంలో 10 ఎకరాల్లో బొప్పాయి తోటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. భారీ వరదలు పోటెత్తి అనేక గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రోడ్లు తెగిపోగా, మరికొన్ని చోట్ల బీటీ కొట్టుకుపోయి కంకర తేలింది. పెద్దవంగర మండలం అవుతాపురం, గండ్లకుంట రెండు చోట్ల వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రెండు రోజుల పాటు అవుతాపురం- కొడకండ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ- నర్సింహులపేట, దుబ్బతండా- దంతాలపల్లికి వేళ్లే దారిలో రెండు చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల వద్ద సీసీ రోడ్డు ధ్వంసమైంది. రేపోణి- దాట్ల మధ్య బీటీ రోడ్డు వరద ఉధృతికి కోతకు గురైంది.