హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి వచ్చేనెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహార పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆమె సీడీపీవోలను ఆదేశించారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
తెలంగాణ ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ. ఇల్లిల్లూ జరుపుకునే ఈ పండుగలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాము. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్యాదేవరాజన్కు కృతజ్ఞతలు.
-నల్లా భారతి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు