భూదాన్పోచంపల్లి/చౌటుప్పల్ రూరల్/సెప్టెంబర్ 28 : తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమని ఒడిశా రాష్ట్ర టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ మంత్రి రీటాసాహు కొనియాడారు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అందిస్తున్న రాయితీలు, సదుపాయాలు, మార్కెట్ విధానం బాగున్నాయని ప్రశంసించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం, ఎల్లంబావి, చిన్నకొండూర్, ఎస్ లింగోటం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మంత్రి పర్యటించారు. చేనేత సహకార సంఘం, టూరిజం సెంటర్, చేనేత గృహాలను సందర్శించారు.
ఈ సందర్భంగా రీటాసాహు మాట్లాడుతూ చేనేత కార్మికులు కళాత్మక దృష్టితో తయారు చేసిన వస్ర్తాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. పోచంపల్లి పట్టువస్ర్తాలు ఖండాంతర ఖ్యాతిని పొందడం, భూదాన్పోచంపల్లి ప్రపంచ పర్యాటక ఉత్తమ గ్రామంగా పేరుపొందడం గర్వించదగిన విషయమన్నారు. కార్యక్రమంలో ఒడిశా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిప్యూటీ డైరెక్టర్ మధుస్మిత దాస్, రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ జేడీ ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.