భువనేశ్వర్ : ఒడిశాలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్తో సరిహద్దును మూసివేసి, అంతర్రాష్ట్ర సరిహద్దులో పెట్రోలింగ్ను ముమ్మరం చేసింది. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో గత కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. పొరుగు ప్రాంతాల ప్రజలు రాష్ట్రంలోకి వస్తే కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ చూపాలని ఆదేశించింది. కలహండి, నవపాడలను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మోహపాత్ర సందర్శించారు.
కొవిడ్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని, ప్రోటోకాల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఫేస్ మాస్క్ ధరించాలని, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఇదిలా ఉండగా.. మాస్క్లు ధరించని వారికి విధించే జరిమానాను రెట్టింపు చేయాలని ఆదేశించారు. మొదటి సారి ఉల్లంఘనకు రూ.2వేలు, మరోసారి పట్టుపడితే రూ.5వేలకు పెంచారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న నవపాడ జిల్లాలో గత నాలుగు రోజుల్లో కేసులు ఐదు రెట్లు పెరిగాయి.
అధికంగా కొవిడ్ కేసులున్న రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఒడిశాకు తిరిగి వస్తున్నారని రాష్ట్ర కార్మిక మంత్రి సుశాంత్ సింగ్ తెలిపారు. సరిహద్దు ఎంట్రీ పాయింట్ల వద్ద తాత్కాలిక వైద్య శిబిరాలు సిద్ధంగా ఉంచాలని జిల్లా పరిపాలనను ఆదేశించారు. ఈ ఏడాదిలో ఒడిశాలో రికార్డు స్థాయిలో శనివారం 1,374 కొవిడ్ కేసులు నమోదవగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులో మొత్తం కేసుల సంఖ్య 3,48,182కు చేరింది.