హైదరాబాద్ : రాష్ట్ర చేనేత, జౌళీశాఖ మంత్రి కే తారకరామారావుతో.. ఒడిశా చేనేత జౌళీశాఖ మంత్రి రీటా సాహుతో పాటు అధికారుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా టెక్స్టైల్, చేనేత రంగంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, నేతన్నల సంక్షేమ కార్యక్రమాలపై ఒడిశా బృందం అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా పోచంపల్లి, కొయ్యలగూడెంలోని చేనేత క్లస్టర్ను సందర్శించింది. అక్కడి చేనేత కార్మికులతో మంత్రి రీటా సాహు సంభాషించారు. ప్రధానంగా అక్కడ ఉత్పత్తి చేస్తున్న ఇక్కత్ పట్టు చీరలు వాటి డిజైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరెలను తయారు చేయడంలో చేనేత కార్మికుల నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. డబుల్ ఇక్కత్ ద్వారా తయారుచేస్తున్న బెడ్ షీట్లు, ఇతర ఫర్నిషింగ్ ఉత్పత్తులను పరిశీలించారు.
ఆ తర్వాత హైదరాబాద్ లో తెలంగాణ టెక్స్టైల్ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ నేతన్నల సంక్షేమం, టెక్స్టైల్ చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన అనేక కార్యక్రమాలపై వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రెట్లు భారీగా పెంచిన టెక్స్టైల్ శాఖ బడ్జెట్ నుంచి మొదలుకొని చేనేత కార్మికులకు అవసరమైన ముడిసరుకుపై ఇచ్చే సబ్సిడీ, నేతన్న అందిస్తున్న బీమా సౌకర్యం, రాష్ట్రం పవర్ లూమ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా, ప్రతిష్టాత్మక బతకమ్మ పండగకు ఆడబిడ్డలకు కానుక ఇచ్చేలా ద్విముఖ వ్యూహంతో చేపట్టిన బతుకమ్మ చీరెల కార్యక్రమం అనేక కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు.
దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ పరిశ్రమ కోసం రాష్ట్రంలో చేపట్టిన భారీ కాకతీయ మెగా టెక్టైల్ పార్క్, సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న అపరెల్ పార్క్, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన వివిధ మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను సైతం ప్రస్తావించారు. కేవలం గత ఎనిమిదేళ్లలో టెక్స్టైల్ శాఖలో చేపట్టిన కార్యక్రమాలు, పరిశ్రమ సాధించిన అభివృద్ధిపై రీటా సాహు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించారు. ముఖ్యంగా ఇక్కడి కార్మికుల కోసం చేపట్టిన నేతన్న బీమా పథకం, చేనేత కార్మికులకు అవసరమైన ముడిసరుకుపై 55 శాతం అందిస్తున్న సబ్సిడీ, నేతన్న పొదుపు పథకం, రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన బడ్జెట్ వంటి అంశాలన్నింటిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
తెలంగాణ టెక్స్లైట్ శాఖ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఒక నివేదికను తమకు అందిస్తే తమ రాష్ట్రంలో ఆయా కార్యక్రమాలను అమలు చేసే అంశాన్ని ఒడిశా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తమ రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా మంత్రి కే తారకరామారావుని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ఒడిశా మంత్రి రీటా సాహు, అధికారుల అధికారుల బృందాన్ని చేనేత శాలువలు, ఫిల్లిగ్రి ఉత్పత్తులతో సన్మానించారు.