హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చేనేత, టైక్స్టైల్స్ విధానాలు అద్భుతమని ఒడిశా చేనేత, జౌళి శాఖమంత్రి రీటా సాహూ కితాబిచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ టైక్స్టైల్స్, చేనేత కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు ఒడిశా మంత్రి నేతృత్వంలోని అధికారుల బృందం రాష్ర్టానికి వచ్చింది. రాష్ట్రం లో నేతన్న సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అధ్యయనం చేసింది. పోచంపల్లి, కొయ్యలగూడెంలోని చేనేత క్లస్టర్లను సందర్శించింది. అక్కడ ఉత్పత్తి చేస్తున్న ఇక్కత్ పట్టు చీరలు, డిజైన్ల గురించి తెలుసుకున్నారు.
డబుల్ ఇక్కత్ ద్వారా తయారు చేస్తున్న బెడ్షీట్లు, ఇతర ఫర్నిషింగ్ ఉత్పత్తులను పరిశీలించారు. ఇక్కత్ చీర తయారీలో చేనేత కార్మికుల నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అనంతరం హైదరాబాద్లో రాష్ట్ర టెక్స్టైల్స్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో రీటా సాహూ భేటీ అయ్యారు. నేతన్నల సంక్షేమం, టెక్స్టైల్స్, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాల గురించి ఒడిశా మంత్రికి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెక్స్టైల్స్ శాఖ బడ్జెట్ అనేక రెట్లు పెంచడం, ముడిసరుకుపై ఇచ్చే సబ్సిడీ, బీమా సౌకర్యం గురించి తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడైనా పవర్లూమ్ సంక్షోభం తలెత్తితే అన్నివిధాలుగా తట్టుకునేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్టు వివరించారు.
అందులో భాగంగానే బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ కాకతీయ మెగా టైక్స్టైల్స్ పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్కులు నెలకొల్పామని చెప్పారు. కేవలం ఎనిమిదేండ్లలో టైక్స్టైల్స్ రంగం అభివృద్ధికి తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలపై ఒడిశా మంత్రి రీటా సాహూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేతన్న బీమా, నేతన్న పొదుపు పథకాలు, ముడిసరుకుపై 55 శాతం సబ్సిడీ, బడ్జెట్లో భారీగా కేటాయింపులు వంటి అంశాలపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ టెక్స్టైల్స్ శాఖ చేపట్టిన కార్యక్రమాల నివేదిక ఇస్తే తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు తమ ముఖ్యమంత్రితో మాట్లాడుతామని తెలిపారు. ఒకసారి ఒడిశాలో పర్యటించాలని మంత్రి కేటీఆర్ను రీటా సాహూ ఆహ్వానించారు.