మచిలీపట్నం: వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ మినీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ పేర్లను లేవనెత్తి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఎన్టీఆర్ వారసుడు చంద్రబాబు కానే కాదన్న ఆయన.. అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అనడంతో ప్లీనరీలో కేకలు, విజిల్స్ వేస్తూ ఆయన వ్యాఖ్యలకు కార్యకర్తలు మద్దతు తెలిపారు.
‘వారసుడు అంటే తాత, కొడుకు, మనవడు. అలాంటప్పుడు చంద్రబాబు ఎలా వారసుడవుతాడు? ఆయన్నేమైనా ఎన్టీఆర్ దత్తత తీసుకున్నారా? ఎన్టీఆర్ అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్’ అని కొడాలి నాని చెప్పారు. ఎన్టీఆర్ది సింహంలా గాండ్రించే రక్తం కాగా, చంద్రబాబుది నక్కజిత్తుల రక్తం అని వ్యాఖ్యానించడంతో ప్లీనరీలో నవ్వులు విరిసాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆస్తి కాదన్నారు.
గుడివాడ మండలంలో ఏర్పాటుచేసిన ఎన్టీరామారావు విగ్రహానికి వైసీపీ రంగులు వేయడాన్ని మీడియా ప్రస్తావించగా.. కొడాలి నాని తనదైన శైలిలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పార్టీ నుంచి ఎన్టీఆర్ను 1995 లో సస్పెండ్ చేసింది చంద్రబాబే అని, పెద్దాయన చనిపోయేంత వరకు ఆయనను పార్టీలోకి అనుమతించలేదని విచారం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కోర్టుకెళ్లిన చంద్రబాబు.. ఎన్టీఆర్కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని, పార్టీ లోగోతోపాటు కార్యాలయం కూడా తనదే అని కోర్టుకు చెప్పారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్టీ రామారావు తమకే చెందుతారని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాలన్నీ బంగారు వర్ణంలో ఉండేవి, ఇప్పుడు వాటికి పసుపు రంగు పూస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.