అనంతపురం: సేవా కార్యక్రమాల్లో ముందుండే హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ మరో కొత్త సేవకు శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని పేదలకు ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ‘ఎన్టీఆర్ ఆరోగ్య రథం’ ను ప్రారంభించేందుకు బాలయ్య బాబు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హిందూపురంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు తక్కువ ధరలో ఆహారం అందిస్తున్నారు.
‘ఎన్టీఆర్ ఆరోగ్య రథం’ నిమిత్తం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించారు. వచ్చే వారం ఈ రథాన్ని బాలకృష్ణ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ వాహనం ఇప్పటికే హిందూపురానికి చేరుకున్నది. ఈ రథం 104 మాదిరిగానే వైద్య సేవలు అందించున్నది. ఈ రథంలో వైద్యుడితోపాటు నర్సు, ఫార్మాసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆరుగురు సిబ్బంది, మందుల కౌంటర్ ఉండనున్నాయి. నిత్యం ఒక్కో గ్రామాన్ని సందర్శిస్తూ అక్కడి ప్రజల ఆరోగ్య బాగోగులు సమీక్షిస్తారు. ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లు తేలితే.. కార్పొరేట్ ఆస్పత్రికి రెఫర్ కూడా చేస్తారని హిందూపురం టీడీపీ నాయకులు చెప్తున్నారు.
బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉండి అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్న బాలకృష్ణ.. ఇప్పుడు తన నియోజకవర్గం ప్రజలపై దృష్టి సారించారు. ఇందుకు దాదాపు రూ.40 లక్షల వ్యయంతో ‘ఎన్టీఆర్ ఆరోగ్య రథం’ ను తయారుచేయించారు. గ్రామల్లోని తమ వద్దకే వచ్చి వైద్య సేవలు అందించాలని బాలయ్య బాబు నిర్ణయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బాలకృష్ణ అల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఇప్పటికే మంగళగిరిలో సంజీవని ఆరోగ్య రథం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.