హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): దేశ గతిని మార్చగల దార్శనిక నాయకుడు సీఎం కేసీఆర్ అని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ఎన్నారైలు పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరం అవుతాయని చెప్పారు. దేశాన్ని సస్యశ్యామలం చేయగల నేర్పరి సీఎం కేసీఆర్ అనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశంపై యూకేలోని వివిధ ప్రాంతాల్లోని ఎన్నారైల అభిప్రాయాలు..
కేంద్రం సహకరించకపోయినా..
కేసీఆర్కు సంపూర్ణ సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒకరికీ ఉన్నది. అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ సాధించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా, అనేక సమస్యలను పరిష్కరించారు. తాగు, సాగునీటిని అందించారు. నల్లగొండ నుంచి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేశారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసినట్టే దేశాన్ని చేయగల విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. కుల, మత, ప్రాంత, వర్గ రహిత దేశం కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– సైదిరెడ్డి ఎడ్ల, ఐటీ కన్సల్టెంట్, యూకే
దేశాన్ని మార్చే శక్తి ఉన్న నేత
కేసీఆర్ లాంటి ముందు చూపు ఉన్న నాయకుడు దేశానికి అవసరం. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభు త్వ ఆస్తులను కట్టబెడుతూ ప్రజలను మోసం చేస్తున్న పార్టీలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ పని చేయగల సమర్థుడు కేసీఆర్ మాత్రమే. బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్కే ఉన్నది.
– సుష్మునరెడ్డి నల్ల, యూకే
విజన్ ఉన్న నాయకుడు
కేసీఆర్ జా తీ య రాజకీయాల్లోకి వస్తే సామాన్యులకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ దూరదృష్టితో దేశం అన్ని విధాలా బాగుపడుతుంది. ఆయన పాలనా అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆయన ప్రవేశం దేశ చరిత్రలో మైలురాయి. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
– శ్రీకాంత్రెడ్డి జింకల, యూకే
కేసీఆర్తోనే నవభారతం
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా నిలిపారు. తన పాలనా దక్షతతో తల ఎత్తుకునే స్థాయికి తెచ్చారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ మాడల్ దేశానికి అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే నవభారత నిర్మాణం సాధ్యం అవుతుంది.
– తకళ్లపల్లి గోపీనాథ్, మాంచెస్టర్, యూకే