టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని తనను సీఎం కేసీఆర్ ఆహ్వానించారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. గురువారం రాత్రి మంత్రి ఎర్రబెల్లితో కలిసి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను ఆయన కలిశారు. భేటీ అనంతరం ఎల్.రమణ మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కోసం తనతో కలిసి ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలిపారు. ఇందుకు సానుకూల నిర్ణయం ఉంటుందని కేసీఆర్కు చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా, చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీకి అవసరమని ఎర్రబెల్లి తెలిపారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కోల్మైన్స్ బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా.. తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రసంగించారు. ఇవాళ రాష్ట్రంలోకి కొత్త బిచ్చగాళ్లు వచ్చారని.. నిన్న మొన్న పదవులు వచ్చినోళ్లు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ను తిడితేనే పెద్ద నాయకులం అయిపోతామనే చిల్లర ఆలోచనా విధానాన్ని మానుకోవాలని సూచించారు.
మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్డౌన్ కాలంలో ఫీజులు చెల్లించలేక ఢిల్లీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న ఐశ్వర్య కుటుంబానికి అండగా నిలిచారు. షాద్నగర్ నుంచి ఐశ్వర్య తల్లిదండ్రులను ప్రగతిభవన్కు పిలిపించి రూ.2.50 లక్షల ఆర్థికసాయం అందజేశారు. షాద్నగర్లో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుకు కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈ నెల 9న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మళ్లీ సమావేశం నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో భేటీ కీలకంగా మారింది. కాగా, కృష్ణా నీటి వినియోగంపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే.
కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత, తాత్కాలిక అంగ వైకల్యం పొందిన 588 మంది కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13.96 కోట్ల ఆర్థిక సాయం అందించింది. రవీంద్ర భారతి వేదికగా కేసీఆర్ అభయ హస్తం పథకం కింద గీత కార్మికుల కుటుంబాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం అందించారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మొదటి త్రైమాసికంలో బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.6,337 కోట్ల టర్నోవర్ సాధించగా.. మొత్తం 663.32 కోట్ల లాభాలను నమోదు చేసింది. మొత్తమ్మీద మొదటి త్రైమాసికంలో 78 శాతం వృద్ధిని సాధించింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ఓ పగటి వేషగాడని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు.
కేంద్ర ఐటీశాఖ మంత్రిగా ఇవాళే బాధ్యతలు చేపట్టిన అశ్విని వైష్ణవ్.. వచ్చీ రాగానే సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్కు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేలపై రూపుదిద్దుకున్న చట్టాలే అత్యున్నతమని, కచ్చితంగా కొత్త ఐటీ రూల్స్ను ట్విట్టర్ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. మాజీ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పలు మార్లు ట్విట్టర్కు ఇలాంటి వార్నింగ్లే ఇచ్చారు. కానీ ట్విట్టర్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు.
ప్రేక్షకులు లేకుండా టోక్యో ఒలింపిక్స్ జరుగనున్నాయి. జపాన్లో కొవిడ్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా ఒలింపిక్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడలు జరిగే ప్రాంతాల్లో అత్యయిక పరిస్థితి విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తమయో మారుకావా గురువారం తెలిపారు.
హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మొయిజ్, అతని భార్యపై తన అధికారిక నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొయిజ్ మృతి చెందారు. అధ్యక్షుడిని హత్య చేసిన కేసులో అనుమానితులుగా ఉన్న నలుగుర్ని భద్రతా దళాలు తుదముట్టించాయి. మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో లింకు ఉన్న మరికొంత మంది అనుమానితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.