కరోనాను ముందస్తుగా గుర్తించి, కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్లో అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ కోసం చేయదగ్గ పనేంటో గుర్తించడంలో వైద్యశాఖ అధికారులు కసరత్తు చేసి సఫలీకృతం కావాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50 వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సూచించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు.
ఈ నెల 13వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యవసాయం, పల్లె, పట్టణ ప్రగతితో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఈ నెల 13వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందించింది. శుక్రవారం ప్రగతిభవన్లో దేవస్థాన ట్రస్టీ ఫౌండర్ కె.సాయిబాబా గౌడ్, ఈవో అన్నపూర్ణ సీఎం కేసీఆర్ను కలిసి ఆహ్వానించారు.
తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కిటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో కీటెక్స్ ప్రతినిధుల బృందం శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను కేటీఆర్ వారికి వివరించారు. తెలంగాణలోని ప్రభుత్వ విధానాలు తమకు నచ్చాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని కీటెక్స్ బృందం తెలిపింది.
కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్లోకి పంపి రాష్ట్రంలోకి చంద్రబాబు అడుగు పెడుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి మంత్రి హరీష్ రావు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
బోనాల పండుగ కోసం ప్రభుత్వం రూ.15కోట్లు విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిధులు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం గోల్కొండ కోటపైనున్న జగదాంభిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి బోనం పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ గురువారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు రమణ పంపారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ జవాన్ వీరమరణం పొందాడు. కశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో నిన్న ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. వారిలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన మరుపోలు జశ్వంత్ రెడ్డి కూడా ఉన్నారు.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి నిన్నటి కంటే 5.4 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడింది. తెలంగాణలో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,00,103 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 3,040 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
గర్భిణులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ సూచించారు. శుక్రవారం ఆయన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్తో కలిసి దేశంలో కొవిడ్ పరిస్థితిపై విలేకరులతో మాట్లాడారు. దేశంలో మోడెర్నా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చురుగ్గా పని చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా నేపథ్యంలో చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టేను పొడిగించింది. జూలై 28 వరకు యాత్రను నిలిపివేయాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. స్వల్ప సంఖ్యలో యాత్రికులను అనుమతించాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఇటీవల కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను మళ్లీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా పలు నూతన వేరియంట్లు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కప్పా, లాంబ్డా వేరియంట్లను దృష్టిసారించాల్సిన స్ట్రెయిన్లుగా గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, కేరళలో జికా వైరస్ కేసులు బయటపడడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక వేసింది. గర్భం దాల్చిన అయిదు నెలల మహిళలందరికీ జికా పరీక్షలు చేపట్టాలని సూచించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో రూ.కోటి విలువైన 90 ఐఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి మూడు పార్సిళ్లలో వచ్చిన ఫోన్లను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వస్త్రాల పేరు చెప్పి ఫోన్లను తరలిస్తున్నారని ఎయిర్ కార్గో కస్టమ్స్ (ఏసీసీ) ఎక్స్పోర్ట్ కమిషనరేట్ పేర్కొంది.