న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో వచ్చిన ఆకస్మిక వరద ఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. పవర్ ప్లాంట్ నిర్మాణం వల్లే ఆ విషాద ఘటన జరిగిందా అన్న కోణంలో జరుగుతున్న విచారణ పూర్తికాలేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. హిమాలయాలు చాలా తక్కువ వయసున్న పర్వతశ్రేణులని, కొన్ని ప్రాజెక్టుల వల్ల పర్వతాలు దెబ్బతింటాయని, డైనమేట్ల వాడకం వల్ల వృక్ష సంపదకు నష్టం ఏర్పడుతుందని, ఇదొక ఉత్తరాఖండ్లోనే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని ఆయన అన్నారు. మరి ఇలాంటి సమయంలో డైనమేట్ల వాడకాన్ని తగ్గిస్తారా అని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ్ ప్రశ్నించారు.
డైనమైట్లు వాడారా లేదా అన్నద చాలా టెక్నికల్ అంశమని, ఓ ఉన్నత స్థాయి కమిటీ ఆ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. అనుమతుల కన్నా ఎక్కువ స్థాయిలో వృక్షాల నరికివేతను ప్రోత్సహించమని మంత్రి జవదేకర్ తెలిపారు. మంచుపర్వతాల్లో జరుగుతున్న వాతావరణ మార్పులపై ఆరు సంస్థలు అధ్యయనాలు చేస్తున్నాయని, సర్వసాధారణంగా గ్లేసియర్లు తగ్గుతుంటాయని, ఇది సహజమైన చర్య అని, ఒక్కొక్కసారి వాతావరణ మార్పుల వల్ల కూడా ఇలా జరుగుతుందని మంత్రి తెలిపారు. అయితే ఎగువ గంగా నది ప్రాంతంలో ఎటువంటి కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వలేదని మంత్రి చెప్పారు.
వాతావరణ మార్పు అనేది ఓ ప్రాంత సమస్య కాదు అని, ఇది యావత్ భూగోళ సమస్య అని మంత్రి అన్నారు. అభివృద్ధి దేశాల కోసం వంద బిలియన్ల డాలర్లు ఖర్చు చేసేందుకు 2009లో హామీ ఇచ్చారని, ఇప్పుడు అది ట్రిలియన్ డాలర్లు దాటిందని, కానీ ఆశించిన రీతిలో నిధులు విడుదల కావడం లేదని మంత్రి జవదేకర్ తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక, సాంకేతిక సహకారం అవసరమన్నారు. వాతావరణ మార్పులను కేంద్ర ప్రభుత్వం ఖండించడం సరిగా లేదని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. దీనికి మళ్లీ మంత్రి సమాధానం ఇస్తూ.. వాతావరణ మార్పులు, అకాల వర్షాలకు లింకు లేదని నేను చెప్పడంలేదని, కానీ ప్రతి మార్పును వాతావరణ మార్పుకు లింకు చేయడం సరికాదన్నారు. కార్పొరేట్ సంస్థలతో తాను మాట్లాడినట్లు చెప్పిన మంత్రి.. వాతావరణ మార్పులపై పోరాడేందుకు అధిక సంఖ్యలో చెట్లు నాటుతున్నట్లు మంత్రి తెలిపారు. సౌరశక్తిలో 2030 నాటికి 40 శాతం ఇంధన సామర్ధ్యాన్ని సాధిస్తామని మంత్రి చెప్పారు.