అమరావతి : ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిని మాత్రమే అభివృద్ధి చేయాలనడం వెనుక దురుద్దేశం దాగి ఉందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. కేవలం ఒక అమరావతి అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితులు ఏమిటని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. ఇవాళ ఆయన శ్రీకాకుళం జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రతిపక్షం అంగీకరించడం లేదని ఆరోపించారు.
ఒక్క చోటనే అభివృద్ధి అనేది సరికాదని శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పిందని వెల్లడించారు. సృష్టించిన సంపద అన్ని ప్రాంతాల్లో సమానంగా వినియోగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మూడు రాజధానులు నెల కొల్పుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 65 సంవత్సరాలల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డాయని, మరోసారి ఆ తప్పిందం జరుగకుండా ఉండాలంటే ప్రజలు చంద్రబాబు మాయలో పడవద్దని కోరారు. అమరావతి రాజధాని అభివృద్ధికి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లతో అభివృద్ధి చేయడం సాధ్యమయ్యే పనేనా అని ధర్మాన అన్నారు.