లక్నో: నలుగురు వ్యక్తులు ఒక బాలుడ్ని కిడ్నాప్ చేశారు. బాలుడి తండ్రిని రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలతో కిడ్నాప్లర ఆచూకీని గుర్తించారు. నిందితులపై కాల్పులు జరిపి బాలుడ్ని రక్షించారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యాపారవేత్త కుమారుడైన 11 ఏళ్ల హర్షను నలుగురు వ్యక్తులు ఆదివారం కిడ్నాప్ చేశారు. ఆ వ్యాపారిని రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, బాలుడు మిస్సింగ్పై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పది గంటల్లో కిడ్నాపర్ల ఆచూకీని గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున సాయుధ పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది. ఈ సందర్భంగా స్వల్పంగా ఎన్కౌంటర్ జరిగింది. పోలీస్ కాల్పుల్లో ఇద్దరు కిడ్నాపర్లు గాయపడ్డారు. మరో ఇద్దరు పారిపోయారు. బాలుడ్ని కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు రక్షించారు. ఎన్కౌంటర్లో గాయపడిన ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. పారిపోయిన మరో ఇద్దరిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు బాలుడి కిడ్నాప్పై వెంటనే స్పందించి రక్షించిన పోలీస్ బృందాన్ని డీసీపీ అభిషేక్ వర్మ ప్రశంసించారు. ఆ బృందానికి రూ.25,000 నగదు బహుమతిని ప్రకటించారు. పారిపోయిన మిగతా ఇద్దరు నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు.