స్టాక్హోమ్, అక్టోబర్ 4: ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. ఫోటాన్ చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పరిశోధనలకు గానూ అలైన్ ఆస్పెక్ట్ (ఫ్రాన్స్), జాన్ ఎఫ్ క్లాసర్ (అమెరికా), ఆంటన్ జైలింగర్కు ఈ బహుమతి వరించింది. ఈ మేరకు స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం పురస్కారాలను ప్రకటించింది. వాస్తవానికి గత దశాబ్దానికిపైగా నోబెల్ రేసులో వీరి ముగ్గురి పేర్లూ వినిపిస్తున్నాయి.
ఎట్టకేలకు ఈ సారి వారికి నోబెల్ వరించింది. 2010లో వీరు వోల్ఫ్ ప్రైజ్ను దక్కించుకున్నారు. కాగా, ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఎన్టాంగిల్డ్ క్వాంటమ్ స్టేట్స్ గురించి విస్తృత పరిశోధనలు నిర్వహించారు. ఇక్కడ రెండు కణాలు విడిపోయినా ఒకే యూనిట్గా వ్యవహరిస్తాయి. వీరి పరిశోధన.. క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ నెటవర్క్స్, సెక్యూర్ క్వాంటమ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్లో కీలక మార్పులకు నాంది కానున్నదని నోబెల్ జ్యూరీ పేర్కొన్నది. గత ఏడాది కూడా భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ దక్కింది. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై పరిశోధనకు గానూ సుకురో మనాబే, క్లాస్ హలిస్మన్, జార్జియో ఫారిసీలకు పురస్కారం లభించింది. నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో స్వాంటే పాబోకు నోబెల్ను ప్రకటించారు. బుధవారం రసాయన శాస్త్రంలో విజేతలను ప్రకటించనున్నారు.