స్టాక్హోమ్, అక్టోబర్ 5: రసాయన శాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి దక్కింది. క్లిక్ కెమిస్ట్రీ అండ్ బయోఆర్థోగోనల్ రియాక్షన్స్ను అభివృద్ధి చేసినందుకు కరోలిన్ ఆర్ బెర్టోజీ, మోర్టెన్ మెల్డల్, కే బ్యారీ షార్ప్లెస్కు బహుమతి అందజేస్తున్నట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. కాగా, గత ఏడాది ఇద్దరికి నోబెల్ బహుమతి అందజేశారు. పరమాణు నిర్మాణంలో ఆర్గానోక్యాటలసిస్ అభివృద్ధి చేసినందుకు 2021లో బెంజిమిన్ లిస్ట్, డేవిడ్ మెక్మిల్లన్కు ఈ అవార్డు దక్కింది.
బ్యారీకి రెండోసారి
బ్యారీ షార్ప్లెస్ కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతి అందుకోబోతుండటం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆయన 2001లో నోబెల్ బహుమతి అందుకొన్నారు.
క్లిక్ కెమిస్ట్రీ అండ్ బయోఆర్థోగోనల్ రియాక్షన్స్ ఔషధాలను డిజైన్ చేయటంలో వీటి పాత్ర కీలకం. క్యాన్సర్ ఔషధాల తయారీ, డీఎన్ఏ మ్యాపింగ్, ప్రత్యేక పదార్థాల రూపకల్పనకు ఉపయోగపడతాయి.
శాంతి నోబెల్ రేసులో జుబైర్
ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకులు, ఇండియన్ ఫ్యాక్ట్చెకర్స్ మహ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హా నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలిచారు. ఈ బహుమతికి నామినేట్ అయిన వారిలో వీరిద్దరు కూడా ఉన్నారని ప్రముఖ మీడియా సంస్థ టైమ్ పేర్కొన్నది. వీరితో పాటు పోటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐక్యరాజ్యసమితి శరణార్థ ఏజెన్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, రష్యా అసమ్మతివాది, పుతిన్ విమర్శకుడు నావల్నీ ఉన్నారు.