ఓస్లో, అక్టోబర్ 7: మానవ హక్కుల పరిరక్షకులకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. బెలారస్ మానవ హక్కుల కార్యకర్త అలెస్ బియాలియాట్స్కీతోపాటు రష్యాకు చెందిన మెమోరియల్, ఉక్రెయిన్కు చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థలకు ఈ బహుమతి అందజేయనున్నట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది.
అలెస్ మానవ హక్కుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని, తన దేశ పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తున్నారని కొనియాడింది. కాగా, ఆయనను బెలారస్ ప్రభుత్వం ప్రస్తుతం జైల్లో ఉంచింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారని ఆరోపిస్తూ ఎలాంటి విచారణ చేపట్టకుండానే అరెస్టు చేసి జైలుకు పంపింది. అటు.. మెమోరియల్, సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థలు తమ దేశాల్లో యథేచ్ఛగా సాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని కమిటీ వెల్లడించింది. పుతిన్ పుట్టినరోజున రష్యా, ఉక్రెయిన్ సంస్థలకు శాంతి బహుమతి ప్రకటించటం గమనార్హం.