కసి, పట్టుదలతో శ్రమించాలి
తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి
ఉద్యోగార్థులు ఫ్రీ కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి
స్టడీ మెటీరియల్ పంపిణీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి, జూన్ 13 : ఉద్యోగం సాధించేవరకూ విశ్రమించొద్దని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ సెంటర్లను ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో నియోజకవర్గం పరిధిలో ఉచిత కోచింగ్ తీసుకుంటున్న ఉద్యోగార్థులకు సోమవారం ఆయన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ..పేదరికంలో పుట్టడం తప్పుకాదని, పేదరికంతో చనిపోవడం తప్పన్నారు. ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో సక్సెస్ కావాలనే ఆకాంక్ష, తపన ఉండాలన్నారు. పట్టుదలతో శ్రమించాలని సూచించారు. పోటీ పరీక్షల కోసం ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు.
జిల్లాలో 1300 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు సహాయ,సహకారాలు అందిస్తామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి శిక్షణ కోసం వేలాది రూపాయలఖర్చు భరించలేని వారికి అండగా ఉండడానికే ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల కోసం శౌర్య అకాడమీ వారితో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి ఎంపీపీలు లోయపల్లి నర్సింగ్రావు, నారెడ్డి దశరథ్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, శౌర్య అకాడమీ డైరెక్టర్ నరేశ్, నిర్వాహకుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.