అహ్మదాబాద్:కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్నఆఖరి మూడు టీ20లకు అభిమానులను అనుమతించకూడదని గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండగా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
దీంతో మంగళవారంతో పాటు ఈ నెల 18, 20న జరగాల్సి ఉన్న టీ20లు ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలోనే జరుగనున్నాయి. ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇస్తామని ప్రకటించింది. కాంప్లిమెంటరీ టికెట్లు పొందిన వారు స్టేడియానికి రావొద్దని సూచించింది. తొలి టీ20 మ్యాచ్కు 67,200 మంది ప్రేక్షకులు హాజరుకాగా రెండో టీ20కి 66,352 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు.