హైదరాబాద్ : సింగరేణిలో బీజేపీ అనుబంధ బీఎంఎస్ (భారత్ మజ్దూర్ సంఘ్) చేపడుతున్న కార్మిక చైతన్య యాత్రకు అడుగడుగునా కార్మికుల నుంచి నిరసన వెల్లువెత్తుతున్నది. మందమర్రిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న యాత్రలో బీజేపీ నాయకులు పాల్గొనడాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీరాంపూర్ ఆర్కే-5బీ గనిపై శుక్రవారం గేట్ మీటింగ్ను కార్మికులు బహిష్కరించారు. తాము చెప్పేది వినాలని ఎంత విజ్ఞప్తి చేసినా కోరినా కార్మికులు పట్టించుకోకుండా సమావేశ ఆవరణకు రాకుండానే వెళ్లిపోయారు. అనంతరం కార్మికులను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించినా.. వారిని కలిసేందుకు ఇష్టపడలేదు.
కార్మికులు రాకపోయినా ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేశ్ అన్ని కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందాలపై మాట్లాడి వెళ్లిపోయారు. అయితే, వారి ప్రసంగంలో బీజేపీ ప్రస్తావన తేకపోవడం గమనార్హం. చివరకు చేసేది లేక 20 నిమిషాలు కాకుండానే సమావేశాన్ని ముగించుకొని యూనియన్ నేతలు తిరుముఖం పట్టారు. సింగరేణికి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో పాటు ఆదాయ పన్నుపై స్పష్టత ఇవ్వకపోవడంతో బీజేపీ అనుబంధ బీఎంఎస్పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట మందమర్రి ఏరియాలో కేకే-5 గని వద్ద బీజేపీ నేతలను కార్మికులు అడ్డుకున్నారు.