ఖైరతాబాద్, జనవరి 4: హైదరాబాద్ నగరానికి మొదటి పేరు భాగ్యనగర్ అనేది సత్యదూరమని చరిత్రకారుడు, దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి కెప్టెన్ పాండురంగారెడ్డి అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ కింగ్షుక్ నాగ్, రిసెర్చ్ స్కాలర్ సయ్యద్ ఇనాముర్ రహమాన్ గయూర్తో కలిసి సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కులీకుతుబ్షా భాగమతిని రాత్రివేళల్లో కలిసేందుకు మూసీ నదిని దాటి వచ్చేవాడని, అది గమనించి ఆయన తండ్రి ఇబ్రహీం కుతుబ్షా మూసీపై వంతెన (పురానాపూల్) నిర్మించాడని కొందరు.. కులీకుతుబ్షా భాగమతి పెండ్లి చేసుకున్న తర్వాత వారి ప్రేమకు సూచికగా నగరానికి భాగ్యనగర్ అని పేరు పెట్టారంటూ మరికొందరు ఉద్దేశపూర్వకంగా కట్టు కథలు రాశారని విమర్శించారు. వాస్తవానికి ఇబ్రహీం కుతుబ్షా రాజపత్రం ద్వారా పురానాపూల్ వంతెన 1578లో నిర్మాణానికి ఆదేశాలిచ్చారని, దానికి సంబంధించిన రాతి శాసనం నేటికీ ఉన్నదని చెప్పారు. కులీకుతుబ్షా రాజు కావటానికి రెండేండ్ల ముందే పురానాపూల్ను నిర్మించారని వెల్లడించారు. కులీ రాజైనప్పుడు అతని వయసు పదిన్నరేండ్లు మాత్రమేనని, అప్పుడు భాగమతి వయసు ఎంత అనేది ప్రశ్నార్ధకమని పేర్కొన్నారు. దీనిని బట్టి వారిమధ్య ప్రేమ వ్యవహారం కట్టుకథ మాత్రమేనని తేలిపోతున్నదని చెప్పారు.
బాగ్నగర్ అన్నది ట్రావెర్నియర్
1590లో గోల్కొండలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు రాజు తన పరివారంతో ఖిలాను వదిలి మూసీ దక్షిణ ప్రాంతంలో విడిదిచేశారని, ఆ సమయంలో అక్కడ తటాకాలు, తోటలు నిర్మించారని పాండురంగారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలను బాగ్లింగంపల్లి, నసీర్బాగ్, పూల్బాగ్, బషీర్బాగ్గా పిలుస్తున్నారని చెప్పారు. ఫ్రాన్స్ యాత్రికుడు టావెర్నియర్ గోల్కొండను సందర్శించినప్పుడు ఆ తోటలను చూసి ‘బాగ్నగర్’ అని తన పుస్తకంలో రాశాడని వివరించారు. బాగ్ అంటే తోట అని, అలా గోల్కొండను తోటల నగర్గా అభివర్ణించాడని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ కొందరు భాగ్యనగర్ అని చెప్పడం సరికాదని అన్నారు. కుతుబ్షాహీలు వేయించిన నాణేల్లో భాగ్యనగర్ పేరు ఎక్కడా కనిపించదని, గోల్కొండ, దారుస్, సుల్తనేట్, హైదరాబాద్ అని మాత్రమే ముద్రించారని తెలిపారు.