Nitish with Rahul Gandhi | తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరికేమీ లేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. విపక్ష నేతలతో భేటీ కావడానికి సోమవారం నితీశ్ కుమార్ ఢిల్లీకి వచ్చారు. తొలుత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల నాటికి యావత్ విపక్షాలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా రాహుల్-నితీశ్ కుమార్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. `ప్రాంతీయ పార్టీలను బలహీన పర్చడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సాధారణ ఎన్నికల నాటికి విపక్షాన్ని ఏకం చేయడమే నా ముందు ఉన్న ప్రత్యామ్నాయం. ప్రధానమంత్రి అభ్యర్థిని కావాలన్న ఉద్దేశం నాకు లేదు` అని మీడియాతో నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.
బీహార్లో బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచి ప్రధానమంత్రి పదవి పైనే నితీశ్ కుమార్ కండ్లు ఉన్నాయని ప్రచారం సాగింది. పలు సార్లు తాను ప్రధాని పదవి బరిలో లేనని నితీశ్ కుమార్ పదేపదే చెప్పారు. ఢిల్లీలో న్యూ మహాఘట్బంధన్ కూటమి ఏర్పాటు చేయడమే లక్ష్యంగా విపక్ష నేతలను కలుస్తానని అన్నారు. ప్రతి పక్ష నేతలందరినీ ఒక తాటి మీదకు తేవడం సవాల్ వంటిదేనన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం అరవింద్ కేజ్రీవాల్, జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులతో నితీశ్ కుమార్ భేటీ కానున్నారు. విపక్షాలను ఒక తాటి పైకి తేవడమే లక్ష్యంగా మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఆయన పర్యటించనున్నారని సమాచారం.