విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కరోనా ఆంక్షలను సరళతరం చేసింది. వ్యాక్సిన్ల పరస్పర గుర్తింపుపై 11 దేశాలతో (బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్, లెబనాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగేరీ, సెర్బియా) ఒప్పందం కుదుర్చుకున్నది. ఆయా దేశాల్లో గుర్తింపు పొందిన వ్యాక్సిన్లు లేదా డబ్ల్యూహెచ్వో ఆమోదించిన టీకాలను వేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి పరీక్షలు అక్కర్లేదని, అలాగే వారు హోం క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే వారు కరోనా నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నది. వ్యాక్సిన్ వేసుకోనివారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, హోం క్వారంటైన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయి.