Rupay Credit Cards | యాప్ల ద్వారా నిర్వహించే యూపీఐ లావాదేవీల విషయమై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వరకు జరిపే యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఎటువంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయడం లేదని వివరించింది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏ చార్జీ వసూలు చేయడం లేదని తాజాగా జారీ చేసిన సర్క్యులర్లో వివరించింది. దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ గేట్వేను ప్రోత్సహించడానికి ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గత నాలుగేండ్లుగా దేశంలో రూపే క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. అన్ని ప్రధాన బ్యాంకులు రిటైల్, కమర్షియల్ సెగ్మెంట్లలో ఈ క్రెడిట్ కార్డులు జారీచేస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్ లేదా కరంట్ అకౌంట్తో అనుసంధానమైన డెబిట్ కార్డులతో మాత్రమే యూపీఐ లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే యూపీఐ లావాదేవీలకు క్రెడిట్ కార్డులను అనుసంధానిస్తున్నట్లు తెలిపింది.
తొలుత రూపే క్రెడిట్ కార్డులకు ఈ యూపీఐ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్బీఐ పేర్కొంది. మామూలుగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో జరిపే చెల్లింపులపై బ్యాంకులకు మర్చంట్లు ఎండీఆర్ చార్జీలు చెల్లిస్తాయి. క్రెడిట్ కార్డులతో చేసే ఈ తరహా లావాదేవీలకు 1-2 శాతం ఎండీఆర్ చార్జీలు వర్తిస్తాయి.