న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తో రాజకీయ పార్టీ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కి ఎలాంటి సంబంధాలు లేవని తేలింది. ఈ విషయాన్ని భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తున్న పీఎఫ్ఐని కేంద్రం ఇటీవలనే ఐదేండ్ల పాటు నిషేధించింది. ఈ నేపథ్యంలో తమకు పీఎఫ్ఐతో ఎలాంటి సంబంధాలు లేవని ఎస్డీపీఐ స్పష్టం చేసుకోవాల్సి వచ్చింది.
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ), నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కి మధ్య ఎలాంటి లింకులు లేవని ఎన్నికల సంఘం గుర్తించింది. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై ఎన్ఐఏ కొరడా ఝులిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పీఎఫ్ఐతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసే అన్ని పత్రాలను ఎస్డీపీఐ తమకు అందజేసిందని, వీటిని పరిశీలించిన తర్వాత వారిపై ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఎస్డీపీఐ వైపు నుంచి ఎలాంటి డిఫాల్ట్ లేదని ఆయన చెప్పారు.
కాగా, ఎస్డీపీఐ 2009 జూన్ 21 న ఏర్పడింది. 2010 ఏప్రిల్ 13 వ తేదీన భారత ఎన్నికల సంఘం వద్ద నమోదైంది. ఇప్పటివరకు, ఎస్డీపీఐ పార్టీ కేరళ, తమిళనాడు, రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మునిసిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసింది.