వాట్సాప్లో హాయ్, బాయ్ చెప్పుకొంటున్నారా? రహస్య సమాచారాన్ని బదిలీ చేసుకొంటున్నారా? ఇప్పుడు సరే.. ఇంకొన్ని రోజులైతే మీరు వాట్సాప్లో పంపే ఏ సమాచారం రహస్యం కాబోదు. గోప్యత అంటూ ఏమీ ఉండదు. అలా ఎందుకు? అని అడుగుతారా! వాట్సాప్, టెలిగ్రాం తదితర మెసేజింగ్ యాప్స్ను కేంద్రం టెలికం చట్టాల పరిధిలోకి తీసుకురాబోతున్నది మరి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఇప్పటివరకు మన దేశంలో వాట్సాప్, టెలిగ్రాం, సిగ్నల్, డుయో వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ సర్వీసెస్ టెలికం చట్టాల పరిధిలో లేవు. దీంతో వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా లేదు. కేంద్రం తాజాగా తెచ్చిన కొత్త ‘ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు – 2022’లో ఈ సంస్థలన్నింటినీ చేర్చారు. బిల్లు చట్టంగా మారితే ఇకపై ఈ సంస్థలన్నీ కేంద్రం నుంచి విధిగా లైసెన్సులు తీసుకోవాలి. అయితే, ఎంట్రీ, లైసెన్స్, రిజిస్ట్రేషన్ తదితర వాటికి ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని బిల్లులో ప్రతిపాదించారు. వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్లో వినియోగదారులు పంపుకొనే సందేశాలు, వీడియోలు ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటాయి. అంటే సదరు వ్యక్తి అనుమతి లేకుండా వాటిని ఎవరూ చూడలేరు. చాలా సందర్భాల్లో కేసుల దర్యాప్తులో పోలీసులు అడిగినా ఆ సంస్థలు వివరాలు ఇవ్వలేదు. తమ కస్టమర్ల గోప్యతకు భంగం కలుగుతుందనే కారణంతో వివరాలు ఇవ్వటం లేదు. ఇకపై ఇలా ఉండకపోవచ్చు. ఈ సంస్థలు మన చట్టాల పరిధిలోకి వస్తుండటంతో ప్రభుత్వం ఏ సమాచారం అడిగినా ఇవ్వాల్సి ఉంటుంది. దేశ భద్రత, శాంతిభద్రతలు, ప్రభుత్వం తప్పనిసరి అని భావించే సందర్భాల్లో వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన సందేశాలను ప్రసారం కాకుండా నిలిపేయాలని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఈ సంస్థలను వాడుకోకుండా ఏ వ్యక్తినైనా నియంత్రించే అధికారం ప్రభుత్వానికి దఖలు పడుతుంది.
ప్రస్తుతం దేశంలో టెలికం సేవలు అందిస్తున్న సంస్థలు దివాలా తీస్తే వాటి వద్ద ఉన్న స్పెక్ట్రం ఎవరికి చెందుతుంది? అనేదానిపై పాత చట్టాల్లో స్పష్టత లేదు. కొత్త బిల్లులో దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కంపెనీ దివాలా తీసినా, నిర్వహణ లోపాలతోపాటు పోటీతత్వం ప్రదర్శించలేక మూతపడే పరిస్థితి వచ్చినా ఆ సంస్థ వద్ద ఉన్న స్పెక్ట్రంను ప్రభుత్వమే తిరిగి స్వాధీనం చేసుకొంటుంది. ఒకవేళ ఆ సంస్థకు బ్యాంకులు అప్పులు ఇచ్చి ఉన్నా రుణాల కింద స్పెక్ట్రంను తీసుకొనే అధికారం బ్యాంకులకు ఉండదు.
కొత్త బిల్లు ప్రకారం ఇకపై ఈమెయిల్స్ కూడా టెలికం శాఖ నియంత్రణలోకే వస్తాయి. టెలికం సర్వీసులు అనే పదానికి ఈ బిల్లులో స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. బ్రాడ్కాస్టింగ్ సేవలు, ఎలక్ట్రానిక్ మెయిల్స్, వాయిస్ మెయిల్స్, వాయిస్, వీడియో, డాటా కమ్యూనికేషన్ సర్వీసులు, ఆడియో, వీడియో టెక్ట్స్ సర్వీసులు, ఫిక్స్డ్, మొబైల్, ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్, శాటిలైట్ ఆధారిత సేవలు, ఇంటర్నెట్ ఆధారిత సేవలు, గగనతల (ఇన్ఫ్లైట్), సముద్రయాన సేవలు, మెషీన్ టు మెషీన్ సమాచార సేవలు, ఓటీటీలు టెలికం చట్ట పరిధిలోకి వస్తాయి.
టెలికం సేవలు అందిస్తున్న సంస్థలన్నింటిపై ప్రస్తుతం ట్రాయ్కి పర్యవేక్షణ అధికారం ఉన్నది. సంస్థల మధ్య వివాదాలు వచ్చినప్పుడు ట్రాయ్ కలుగజేసుకొని పరిష్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సంస్థలు ఏవైనా తప్పులు చేసినా, కస్టమర్లను మోసం చేసినట్టు తేలినా జరిమానాలు విధించే అధికారం ఉన్నది. ఇకపై సంస్థకు ఇలాంటి అధికారాలు ఉండకపోవచ్చు. కొత్త టెలికం బిల్లులో ట్రాయ్ అధికారాలను కేంద్రం పూర్తిగా తగ్గించింది. ముఖ్యంగా సంస్థలకు లైసెన్సుల జారీలో మార్పులు ప్రతిపాదించింది. ఈ బిల్లు చట్టంగా మారితే సంస్థలకు లైసెన్సుల జారీలో టెలికం శాఖ ట్రాయ్ సలహాను తప్పనిసరి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
టెలికం నియంత్రణ మండలి (ట్రాయ్)ని డమ్మీ చేసేందుకు మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ట్రాయ్ అధికారాలకు కోత వేసి, సంస్థను నామమాత్రంగా చేసి, టెలికం శాఖకు అపరిమిత అధికారాలు కట్టబెట్టేలా బిల్లులో నిబంధనలు చేర్చింది. ముఖ్యంగా టెలికం సంస్థలకు లైసెన్సుల జారీలో ఇప్పటివరకు ట్రాయ్ను తప్పనిసరిగా సంప్రదించాలని ఉన్న నిబంధనను తొలగించాలని ముసాయిదా బిల్లులలో ప్రతిపాదించింది. దీనివల్ల టెలికం శాఖకు అపరిమిత అధికారాలు దఖలు పడుతాయి. లైసెన్సుల జారీలో కేంద్రం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేందుకు వీలు కలుగుతుంది.