వరంగల్ : మీరు పెట్రోల్ బంక్కు వెళ్తున్నారా..? ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాల్సిందే. పెట్రోల్కు వెళ్లే ముందు హెల్మెట్ ధరించాల్సిందే. లేని యెడల మీకు పెట్రోల్ పోయరు. ఈ నిర్ణయం వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ పోయాలని ఆయా పెట్రోల్ బంక్ల సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశారు.
హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డుప్రమాదాల్లో మరణిస్తున్నారని వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధిలోని పెట్రోల్ బంక్ల వద్ద నో హెల్మెట్.. నో పెట్రోల్ అనే బ్యానర్లు ప్రదర్శించి, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
2021లో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన 1,106 రోడ్డుప్రమాదాల్లో.. 426 మంది మరణించినట్లు పోలీసు కమిషనర్ వెల్లడించారు. మరో 1,110 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. 426 మంది మృతుల్లో అధికంగా ద్విచక్ర వాహనదారులే ఉన్నారని స్పష్టం చేశారు. మృతుల్లో అధికంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారేనని తెలిపారు.