ముంబై: హెల్మెట్ ధరించకపోతే ఆ నగరంలో పెట్రోల్ ఫిల్ చేయరు. ద్విచక్ర వాహనదారుల రక్షణ కోసం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఆదివారం నుంచి దీనిని అమలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక గంగాపూర్ రోడ్డులోని సద్భావన పోలీస్ పెట్రోల్ బంకు వద్ద ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ డ్రైవ్ను ప్రారంభించారు. రహదారి భద్రతను పెంచడంతోపాటు, వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించడానికి దీనిని చేపట్టినట్లు చెప్పారు. నాసిక్ నగరంలో గత ఐదేండ్లలో 782 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 825 మంది ప్రజలు చనిపోయారని వెల్లడించారు. మృతుల్లో 467 మంది ద్విచక్ర వాహనదారులని, ఇందులో 397 మంది హెల్మెట్ ధరించక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని వివరించారు.
ఈ నేపథ్యంలో ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ డ్రైవ్ను ప్రారంభించినట్లు మంత్రి ఛగన్ భుజ్బల్ తెలిపారు. దీనిని పక్కగా అమలు చేసేందుకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయకుండా నిఘా పెట్టాలని సూచించారు. హెల్మెట్ ధారణలో ప్రజలకు ఉదాహరణగా నిలిచేందుకు 2,053 హెల్మెట్లను పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా మంత్రి పంపిణీ చేశారు.