అక్టోబర్లో ప్రొరోగ్ కాని సమావేశాలు
ఇది క్యాలెండర్ ఇయర్లో తొలి సెషన్ కాదు
అసెంబ్లీ గత సమావేశాల కొనసాగింపే ఇవి
గవర్నర్ ప్రసంగం అవసరం లేదన్న నిపుణులు
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : వచ్చే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. అయితే.. రాజ్యాంగ నియమ నిబంధనలు, సభా సంప్రదాయాలపై అవగాహన లేని ప్రతిపక్ష, బీజేపీ నేతలు కొందరు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలేంటని సందేహాలు లేవనెత్తుతున్నారు. నిజానికి బడ్జెట్ సమావేశాలకూ, గవర్నర్ ప్రసంగానికీ ఎటువంటి సంబంధమూ లేదు. వాస్తవానికి ఇది ఒక చిన్న సాంకేతిక అంశం మాత్రమే. సభ నిబంధనలు తెలిసిన ఏ ఎమ్మెల్యేకైనా ఈ సాంకేతిక అంశం చాలా సులువుగానే అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో క్యాలెండర్ ఇయర్, సెషన్, సమావేశాలు.. అని మూడు అంశాలు ఉంటాయి. క్యాలెండర్ ఇయర్లో కొత్త సెషన్ మొదలైనప్పుడు జరిగే మొదటి సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కొత్త సెషన్ అనేది పాత సమావేశాలు ప్రొరోగ్ అయిన తర్వాత ప్రారంభమయ్యేది. అసెంబ్లీ గత సమావేశాలు గత ఏడాది అక్టోబర్ 8న వాయిదా పడ్డాయి. సమావేశం ప్రొరోగ్ కాలేదు. ప్రొరోగ్ అయి ఉంటే.. ఆ సమావేశాల సెషన్ అప్పటికి ముగిసి ఉండేది. ప్రొరోగ్ చేయని కారణంగా.. గతంలో వాయిదా పడిన సభను ఎప్పుడైనా సమావేశపర్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు.. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు ఉండబోతున్నాయి. కనుక గవర్నర్ ప్రసంగం అవసరం లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ప్రొరోగ్ అయితే.. తదుపరి సెషన్ మొదటి సమావేశంలో గవర్నర్ ప్రసంగించే అవకాశం ఉంటుంది.
గవర్నర్ ప్రసంగం ఎప్పుడు ఉంటుందంటే..
శాసనసభ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం పరిపాటే. అయితే.. అందుకు కొన్ని సందర్భాలు ఉంటాయి.
1) ఏడాదికి ఒకసారి,
2) ప్రతి ఏడాదిలో మొదటి సెషన్లో,
3) ఎన్నికలు జరిగి, కొత్త సభ కొలువుదీరినప్పుడు. ఈ మూడు సందర్భాల్లో గవర్నర్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
కొత్త సెషన్ అంటే..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 (1) ప్రకారం అసెంబ్లీ ప్రొరోగ్ అయిన తర్వాత తిరిగి సమావేశ పరిస్తే దానిని కొత్త సెషన్గా పరిగణిస్తారు. ప్రొరోగ్ కాని పక్షంలో గత సభనే వాయిదా వేసి తిరిగి సమావేశ పరిచినట్టు భావిస్తారు. దీని ప్రకారం.. గతేడాది అక్టోబర్లో చివరిసారిగా తెలంగాణ శాసనసభ ఎనిమిదో సమావేశం, శాసనమండలి 18వ సమావేశం జరిగింది. ఆ సమావేశాలు పూర్తయిన తర్వాత శాసనసభ ప్రొరోగ్ కాలేదు. అంటే ఇప్పుడు జరుగబోయేవి గత శాసనసభ సమావేశాలకు పొడిగింపు మాత్రమే. కొత్త సమావేశంగా పరిగణించలేము. కనుక గవర్నర్ ప్రసంగం అనే ప్రసక్తే ఉండదని అధికారులు వివరిస్తున్నారు.
గతంలో ఎన్నో ఉదాహరణలు
గవర్నర్ ప్రసంగం లేకుండా సభను ప్రారంభించిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి.