న్యూఢిల్లీ, జూలై 26: ‘మేం అధికారంలోకి వస్తే స్విస్బ్యాంకులో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెస్తాం. దేశ ప్రజలందరికీ ఆ నగదుని పంచుతాం. ఒక్కొక్కరి ఖాతాలో 15లక్షల వరకు వేస్తాం’… 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్రమోదీ ఇచ్చిన వాగ్దానమిది. కానీ, ఆయన ప్రధాని అయ్యాక ఆ విషయమే అటకెక్కించారు. దాని ప్రస్తావన కూడా మళ్లీ ఎక్కడా తేలేదు. స్విస్బ్యాంకులో భారతీయులు దాచుకున్న బ్లాక్మనీ రెట్టింపు అయ్యిందన్న వార్తలు వెలువడ్డాయి. స్విట్జర్లాండ్ సెంట్రల్బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2020లో భారతీయుల దాచుకున్న నల్లధనం రూ. 20,700 కోట్లు కాగా, 2021లో అది 30,533 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే స్విస్ బ్యాంకులో భారతీయుల బ్లాక్మనీ 50శాతం పెరిగిందన్నమాట.
అటు స్విట్జరాండ్ ప్రభుత్వమే అధికారికంగా ఈ గణాంకాలు వెల్లడిస్తుంటే.. తమ వద్ద మాత్రం స్విస్బ్యాంకులో నల్లధనం ఎంత ఉందన్న వివరాలేవీ లేవని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించడం విస్మయపరుస్తున్నది. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారతీయ కంపెనీలు డిపాజిట్ చేసిన డబ్బుపై కచ్చితమైన అధికారిక వివరాలేవీ లేవని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. సోమవారం లోక్సభలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు ఆమె పైవిధంగా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020తో పోలిస్తే 2021లో స్విస్ బ్యాంకుల్లో భారతీయు డిపాజిట్లు పెరిగాయని, ఇటీవల కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నట్టు వెల్లడించారు. ఆ నిధులు భారతీయుల నల్లధనం అని కూడా నివేదికలు వెల్లడించలేదని తెలిపారు. విదేశాలకు నల్లధనం తరలకుండా నిరోధించేందుకు కేంద్రం పలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. 29 విదేశీ ఆస్తుల దర్యాప్తు విభాగాలు ఇందుకోసం పనిచేస్తున్నాయని వెల్లడించారు.