హైదరాబాద్ : కొవిడ్ కొత్త వేరియంట్ వస్తే తప్ప తెలంగాణలో మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలా అనీ, ముప్పు తొలగిపోయిందని అనుకోవద్దని, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడంతో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సోమవారం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాష్ట్రంలో 0.4శాతం మాత్రమే పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు. కరోనా నియంత్రణలో ఉందని, విద్యా సంస్థలు పునః ప్రారంభమైనందున కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అనుకున్నామని.. కానీ ఎక్కడా క్లస్టర్ కేసులు నమోదు కాలేదున్నారు. ఇప్పటివరకు 3200 పాఠశాలల్లో 1.15 లక్షల మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు చేయగా.. 55 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించినట్లు తెలిపారు.
అనుకోని విధంగా కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్లో ఆక్సిజన్ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, 40 శాతం ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ ప్లాంట్స్తో సిద్ధంగా ఉన్నాయన్నారు. 3,600కుపైగా పడకలను చిన్నారుల కోసం సిద్ధంగా ఉంచినట్లు డీహెచ్ తెలిపారు. హైదరాబాద్లో ఈ ఏడాది ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. 2019లో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 4వేలు రిపోర్ట్ కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి 3 వేల కేసులు నమోదైనట్లు చెప్పారు.
వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డెంగ్యూ ప్లేట్లెట్స్పై కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల కష్టాలను ఆసరా చేసుకొని మోసాలకు పాల్పడే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజలు 102 నంబర్కు ఫోన్ ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో చాలా తక్కువగా కేసులు నమోదవుతున్నాయని.. అక్టోబర్ నెలాఖరు వరకు వైరల్ జ్వరాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.